బీ అలర్ట్.. రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం
- జూన్ 7 వరకు కొనసాగనున్న రోహిణి కార్తె
- మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉండనున్న ఎండ ప్రభావం
- అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది
తెలుగు పంచాంగం ప్రకారం నేటి (మే 25) నుంచి అత్యంత శక్తిమంతమైన ‘రోహిణి కార్తె’ ప్రారంభమైంది. జూన్ 7 వరకు కొనసాగే ఈ కాలంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండల వల్ల ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి, వడగాలులు, ఉక్కపోత తీవ్రరూపం దాలుస్తాయి.
ఈ కాలంలో శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్, వడదెబ్బ, తీవ్ర అలసట వంటి ముప్పులు పొంచి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేయకపోయినా తరచుగా మంచి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ (ORS) వంటి పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.